హెన్రీ మార్టిన్ జీవిత చరిత్ర||Henry Martin Biography||Telugu Christian Website||Gospelneeds
హెన్రీ మార్టిన్ జీవిత చరిత్ర||Henry Martin Biography||Telugu Christian Website||Gospelneeds
హెన్రీ మార్టిన్ జీవిత చరిత్ర భారతదేశపు మూఢాచారములపై పోరాడిన వీరుడు
హెన్రీ మార్టిన్ హెన్రీ మార్టిన్ 1781,
ఫిబ్రవరి 18న ఇంగ్లాండులోని ట్రూరోలో జన్మించారు. ఆయన తండ్రి జాన్ మార్టిన్ గని కార్మికుడు. ఆ రోజులలో గని కార్మికుడు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి విశ్రాంతి తీసుకొనెడివాడు. ఆ విశ్రాంతి సమయములో జాన్ మార్టిన్ చదువుకొనెడివాడు. అందువల్ల ట్రూరోలో ఉన్న ఒక వర్తకుని వద్ద గుమస్తాగా చేరాడు. సామ్యూల్ వాకర్ అనే పాస్టరు గారు నడిపించే చర్చికి క్రమంగా వెళ్లేవాడు. సామ్యూల్ వాకర్ గారు 7 సంవత్సరములు పాస్టరుగా పనిచేసి 800 మందిని ప్రభువు దగ్గరకు నడిపించి బాప్తిస్మము ఇచ్చినారు.
జాన్ వెస్లీగారే స్వయంగా తనకంటే సామ్యూల్ వాకర్ మంచి ప్రసంగీకులని ప్రశంసించారు. ఆ చర్చి సభ్యుడిగా జాన్ మార్టిన్ విశ్వాసమందు బలపడ్డాడు. జాన్ మార్టిన్ కుమారుడైన హెన్రీ మార్టిన్ గారు వెస్లీగారి ప్రసంగములను విని దైవభక్తిగల జీవితము జీవించుచుండెడివారు.
మార్టిన్ గారి బాల్యమందే ఆయన తల్లి మరణించింది. తన ఏడవ ఏట ట్రూరోలోని గ్రామర్ స్కూల్ లో చేరాడు. శారీరకంగా బలహీనంగా ఉండే వాడు. కాని తెలివితేటలలో, చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉండేవాడు. తన బాల్య స్నేహితుడైన కెంత్రోతో కలసి 16వ ఏట కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్స్ కాలేజీలో చేరాడు. ఆ రోజులలో ఆ కాలేజీలో చేరిన వారిలో ఎక్కువమంది మిషనెరీలు అయ్యేవారు. తన తండ్రిని మెప్పించాలని కష్టపడి చదివేవాడు. ఎప్పుడూ ఫస్ట్ మార్కులు తెచ్చుకొనేవాడు. హెన్రీ సోదరియైన శాలీ కూడ అదే కాలేజీలో చదువుతూ ఉండేది.
తాను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడని తెలిసిన తరువాత ఆ ఆనంద వార్తను చెప్పుటకు ఇంటికి వచ్చేసరికి అతని తండ్రియైన జాన్ మార్టిన్ ప్రభువునందు నిద్రించాడు. తల్లి ప్రేమను ఎరుగని హెన్రీకి ఇప్పుడు తండ్రి కూడ మరణించాడని తెలిసి ఎంతో దుఃఖించాడు. తండ్రిని మెప్పించుటకు బాగా చదవాలని అనుకొన్నాడు. తండ్రి మరణించే సరికి చదువుపై ఆసక్తి తగ్గిపోయింది. అందువల్ల బైబిల్ పై ఆసక్తి పెంచుకొన్నాడు.
తండ్రి చనిపోయిన దుఃఖమును మర్చిపోవుటకు గంటలకొద్దీ బైబిలు చదివేవాడు. ఎక్కువ సమయము ప్రార్థనలో గడిపేవాడు. గణితశాస్త్రములో హెన్రీకి గట్టి పట్టు ఉండేది. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో గణితశాస్త్రములో పట్టు సాధించిన వారిని సీనియర్ రాంగ్లర్ అనే కోర్సు చదివేవారు. ఆ కోర్సు చదివినవారు మేధావులుగా బ్రిటన్లో పరిగణించ బడెడివారు. హెన్రీ ఆ కోర్సును పూర్తి చేసాడు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చార్లెస్ సిమియోను అనే పాస్టరు గారు యువకులలో సేవా భారమును పెంపొందించుటకు కృషి చేసెడివారు. చార్లెస్ గారికి ఇండియాలో సువార్త ప్రకటించాలని ఎంతో కోరికగా ఉండేది. అప్పటికి విలియంకేరీ గారు బెంగాల్ లోని సిరంపూర్ వచ్చి పరిచర్య చేస్తున్నారు. చార్లెస్ గారు సువార్త పరిచర్య చేయుటకు యువకులు లేవాలని తరచూ ప్రసంగము చేస్తూ ఉండేవారు. హెన్రీ ఆ ప్రసంగములు విని సువార్త చేయుటకు ప్రేరేపించ బడ్డాడు. ఇంటి వద్ద నుండి అతని సోదరియైన శాలీ కూడ హెన్రీకి సువార్త ప్రకటించాలని ఉత్తరములలో వ్రాస్తూ ఉండేది. వారిద్దరి ప్రభావము చేత హెన్రీ సువార్తికుడుగా మారాలని తనను తాను సమర్పించుకొన్నాడు. యూనివర్సిటీ లో అందరూ మెచ్చుకొనేటంత ప్రతిభ చూపిననూ అవి అతనికి తృప్తి ఇవ్వలేదు. ఆ జ్ఞానమును దేవుని పరిచర్య కోసం వినియోగించాలని ముఖ్యంగా విదేశములలో సువార్త పరిచర్య కొనసాగించాలని కలలు కనేవాడు.
ఆ సమయములో డేవిడ్ బ్రెయినార్డ్ గారి జీవిత చరిత్రను హెన్రీ చదివాడు. అమెరికాలోని రెడ్ ఇండియన్కు డేవిడ్ సువార్తను ప్రకటించిన విధానము చదివి ఎంతో ప్రభావితుడైనాడు. (డేవిడ్ బ్రెయినార్డ్ గారు 29 సంవత్సరములు మాత్రమే జీవించారు. కాని వారి జీవితము విలియమ్ కేరీని, హెన్రీ మార్టిన్ , జిమ్ ఎలియట్ ని మరియు అదోనీరామ్ జడ్సనను ప్రభావితము చేసింది. ప్రార్థనా జీవితము, బైబిల్ పఠన, సువార్త వ్యాప్తికి ఎంతో అవసరమని అనేకులు గుర్తించారు. వీరి జీవిత చరిత్రలను మేము ప్రచురించినాము. జిమ్ ఎలియట్ చరిత్రను హతసాక్షులు లో చదువవచ్చును)
హెన్రీ "ప్రభువా! ఇదిగో నేనున్నాను. మీరు ఎక్కడికి పంపిననూ వెళ్లుటకు సిద్ధముగా ఉన్నాను. అరణ్యములో నివసించు క్రూరమైన నరమాంస భక్షకుల దగ్గరకు వెళ్లుటకు సిద్ధముగా ఉన్నాను. ఏవిధమైన సౌకర్యములు లేని ప్రాంతమునకు వెళ్లుటకు సిద్ధముగా ఉన్నాను. నీ రాజ్యము కొరకు నన్ను మరణించ మనిననూ నేను సిద్ధముగా ఉన్నాను” అని ప్రార్థించేవాడు.
డేవిడ్ బ్రెయినార్డ్ ఏవిధమైన సౌకర్యములేని ప్రాంతములో నివసించినాడు. అతి సామాన్యమైన ఆహారమును భుజించినాడు. చెక్కలపై గడ్డి పరిచి దానిపై నిద్రించేవాడు. తాను కూడ అదే విధంగా ఉండాలని ఈ లోకాశలు మరచి దేవునిని మహిమ పరచాలనే ఏకైక ఉద్దేశ్యముతో జీవించాలని హెన్రీ తలంచేవాడు. తన గురువైన సిమియోను మాటలు, డేవిడ్ బ్రెయినార్డ్ జీవితము అతనిని ఎంతగానో ప్రభావితము చేయుట వలన అప్పుడే లండన్లో ప్రారంభమైన ఒక క్రొత్త సొసైటీకి మిషనెరీగా పనిచేస్తానని దరఖాస్తు చేసుకొన్నాడు.
"ది సొసైటీ ఫర్ మిషన్స్ టు ఆఫ్రికా అండ్ ది ఈస్ట్” సొసైటీ వారు అతని దరఖాస్తును ఆమోదించారు. యూనివర్సిటీలో మేధావిగా ఎంచబడినవాడు అన్యులకు సువార్త ప్రకటించుటకు వెళ్లుట అవసరమా? వారికి ఎవరైనా, చదువురాని సామాన్యుడైనా సువార్తను ప్రకటించవచ్చును కదా? అని అందరూ అనుకొన్నారు. ఆయన సోదరి శాలీ కూడ అనుభవము లేని హెన్రీ అనాగరికులకు ఎలా సువార్త ప్రకటించగలడు? అని అనుకొన్నది. కాని హెన్రీ తాను నిలకడగా ఉండి సిద్ధపడుట ప్రారంభించాడు. తన్ను తాను ఉపేక్షించుకొని జీవించవలెనని నిర్ణయించుకొన్నాడు.
బాగా చలిగా ఉన్న సమయములో అందరూ నెగడు వద్ద కూర్చుండి ఉన్నప్పుడు తాను మంటకు దూరంగా కిటికీ వద్ద కూర్చుండి బైబిలు చదువుకొనేవాడు. తన సోదరియైన శాలీకి ఉత్తరము వ్రాస్తూ తాను దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతో ప్రశాంతత అనుభవిస్తున్నాననీ ప్రభువును ఎరుగని అనేకుల గురించి ఇంకా ఎక్కువ సమయము ప్రార్థన చేస్తూ గడపాలని ఉన్నదనీ తెలియజేసాడు.
1803లో హెన్రీ మార్టిన్ పాస్టరుగా అభిషేకించ బడ్డాడు. ట్రినిటీ చర్చికి పాస్టర్ గా ఉన్న సిమియోను గారికి అసిస్టెంట్ గా పనిచేస్తూనే కేంబ్రిడ్జికి సమీపములో ఉన్న లాల్ వర్త్ అనే గ్రామంలో ఉన్న చర్చికి పాస్టరుగా పూర్తి బాధ్యత తీసుకొన్నాడు. విద్యలో హెన్రీ మార్టిన్ రాణించాడు గాని పాస్టరుగా పనిచేయుటకు చాల కష్టపడవలసి
వచ్చింది. దుర్మార్గులకు హెచ్చరిక ఇవ్వకపోతే ఆ దోషమును నీపై మోపుతాను అని యెహెజ్కేలు 3 : 18 లో ఉన్న మాటను తరచు జ్ఞాపకము చేసుకొనేవాడు. అందువల్ల తనకు కనిపించిన ప్రతీ ఒక్కరితో సువార్తను పంచుకొనేవాడు.
ప్రజల పాపములను నిర్భయముగా ఖండించుట వలన అతనికి ఎక్కువ మంది విరోధులైనారు. తాను ఖండించకపోతే ఆ పాపము తనదని హెన్రీ మార్టిన్ భయపడేవాడు. పాపులను గద్దించిన తరువాత వారి
కొరకు కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఒకసారి ఒక విద్యార్థి యొక్క తండ్రి రోగగ్రస్థుడై ఉండగా ఆ విద్యార్థి కొందరు స్త్రీలతో నాటకము చూచుటకు వెళ్లినందున అతనిని గట్టిగా గద్దించాడు. ఆ రాత్రంతా అతని రక్షణ కోసము ప్రార్థించాడు. దేవుడు హెన్రీ మార్టిన్ యొక్క ప్రార్థనను ఆలకించి ఆ విద్యార్థిని రక్షించాడు. తరువాతి కాలములో భారత దేశమునకు సేవ చేయుటకు వచ్చినప్పుడు ఆ విద్యార్థి హెన్రీ మార్టిన్ కు అసిస్టెంట్ గా వచ్చెను.
హెన్రీ మార్టిన్ హెబ్రీ, లాటిన్, గ్రీకు భాషలలో నిష్ణాతుడు. ఇప్పుడు హిందీ, బెంగాలీ, పారసీక మరియు అరబ్బీ భాషలను నేర్చుకొనుట ప్రారంభించాడు. తండ్రి వలన హెన్రీ మార్టిన్ కు కొంత ఆస్తి లభించిననూ సవతి సోదరుడైన
జాన్ అతనిపై దావా వేసి మొత్తము ఆస్తిని కైవసము చేసుకొన్నాడు. అందువల్ల తనను, తన చెల్లిని పోషించు కొనుటకు ఆదాయము లేక కొంత ఇబ్బంది పడ్డాడు .
చర్చి మిషనరీ సొసైటీ సభ్యుడైన చార్లెస్ గ్రాంట్ గారు బెంగాల్ లో పని చేయుటకు ఉత్సాహముగల సేవకుని కొరకు అన్వేషించు చుండిరి. అప్పటికే డేవిడ్
బ్రౌన్ గారు బెంగాల్ లో పనిచేయు చుండిరి. ఆయనకు సహాయము చేయుటకు వెళ్లిన యెడల చార్లెస్ గ్రాంట్ గారు మంచి జీతము ఇచ్చెదనని వాగ్దానము చేసిరి. ఆ ప్రతిపాదనకు ఒప్పుకొనుట వలన హెన్రీ మార్టిన్ కు రెండు ఉపయోగములు కలిగెను.
తన చెల్లెలు శాలీని పోషించు కొనుటకు నిరాటంకముగా ఆదాయము వచ్చు చున్నది. మరియు ఈస్టిండియా కంపెనీ పాస్టరుగా బ్రిటీష్ భూభాగములో ఎక్కడైననూ సువార్త ప్రకటించుటకు అనుమతి ఉన్నది. కంపెనీ వారు తమ వర్తకమునకు నష్టము వచ్చునని
మిషనరీలను ప్రోత్సహించుట లేదు. అందువల్ల ఇండియాకు వచ్చు అనేక మంది బ్రిటీష్ సువార్తికులు డెన్మార్క్ రాజ సంస్థానములలో మాత్రమే సువార్తను ప్రకటించుటకు అనుమతించ బడుచుండిరి. ఆ రోజులలో డెన్మార్క్ రాజు భారతదేశములో కొన్ని భూభాగములను ఆక్రమించుకొని ఉండెను. మార్టిన్ హెన్రీ మిషనరీగా
భారతదేశమునకు వచ్చి యుండినచో అతనికి స్వేచ్ఛ లేకుండెడిది. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా డెన్మార్క్ రాజు సంస్థానములోనూ, బ్రిటీష్ రాజుల భూభాగములోనూ, ఫ్రెంచ్ స్థావరములలోను సువార్త ప్రకటించుటకు వీలు కలిగినది.
కలకత్తాలో అనేక సంవత్సరములు సువార్త సేవ చేసిన డాక్టర్ గిల్ క్రైస్ట్ హిందీ భాషలో నిష్ణాతుడు. విలియమ్ కేరీ గారికి సహచరుడు. బైబిల్ ను హిందీ లోనికి తర్జుమా
చేయాలని ఆశిస్తున్న మార్టిన్ హెన్రీకి ఆయన కొన్ని సలహాలు ఇచ్చినాడు. ముందు భాషపై బాగా పట్టు సాధించమని తరువాతే తర్జుమాకు పూనుకొనమని హితోపదేశము చేసాడు.
1805 ఆగస్టు, 31వ తేదీన మార్టిన్ హెన్రీ ఇండియాకు బయలుదేరాడు. ఆ రోజులలో ఇంగ్లాండు నుండి కలకత్తాకు వచ్చుటకు 9 నెలలు పట్టేది. అతడు ఎక్కిన ఓడ పేరు "యూనియన్ ఈస్ట్ ఇండియా మెన్”. అతడు ప్రయాణిస్తున్న ఈ తొమ్మిది నెలలు తోటి ప్రయాణికులకు, ఓడ సిబ్బందికి యేసు ప్రభువు గురించి చెప్పడము ప్రారంభించాడు. అతని మాటలు విన్న అనేక మంది ప్రభువును అంగీకరించారు. సమయమును వృధా పోనీయ్యక హిందీ మాటలు నేర్చుకొంటూ ఉండేవాడు.
ఆ ఓడలో ఉన్న కొంతమంది విద్యార్థులకు అర్థముకాని గణిత శాస్త్ర విషయములను చెప్పుట వలన వారి అభిమానమును చూరగొన్నాడు.
మార్టిన్ హెన్రీ ప్రయాణిస్తున్న ఓడ సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ వద్ద బొగ్గు కొరకు ఆగినప్పుడు అక్కడ పనిచేస్తున్న ఒక డచ్ మిషనరీ హార్బర్ లో కనిపించాడు. ఆ మిషనరీ పేరు వెర్డర్ కెంప్. అతడు మార్టిన్ హెన్రీకు కాలేజీలో స్నేహితుడు. “నీవు మిషనరీగా వచ్చినందుకు బాధపడుచున్నావా? వేరే మంచి ఉద్యోగము లభిస్తే వెళ్లిపోతావా?” అని ప్రశ్నించాడు. అందుకు కెంప్ “నాకు బ్రిటీష్ రాజ్యమంతా ఇస్తానని అన్నా నేను ఈ పని మానుటకు సమ్మతించను” అన్నాడు. ఆ మాటల వల్ల మార్టిన్ హెన్రీ ప్రోత్సహించ బడ్డాడు.
1806 ఏప్రిల్ 21న ఆ ఓడ మదరాసు చేరింది. మద్రాసులోని విగ్రహారాధికులను, దేవాలయములను ప్రజల ఆచార వ్యవహారములను చూసిన తరువాత తన డైరీలో “వీరిని చూసిన తరువాత ఎంచుకొనిన పని ఎంతో బాధ్యతాయుతమైనది అని గుర్తించాను. ఆత్మల పట్ల నా భారము పది రెట్లు పెరిగినది. భారత దేశము లాభ పడును. అందుకు నీ ప్రాణము కావాలి అని ఎవరైనా నన్ను అడిగితే నా చివరి రక్తపు బొట్టు చిందించుటకు నేను సిద్ధంగా ఉన్నాను” అని వ్రాసుకొన్నాడు.
1806 మే 14న మార్టిన్ హెన్రీ కలకత్తా వెళ్లి విలియమ్ కేరీ గారిని కలుసుకొన్నాడు. అక్కడ ఉన్నప్పుడు కేరీ గారి దిన చర్యను గమనించాడు. ఉదయ కాల అల్పాహారము పూర్తియైన వెంటనే ఒక పండితుని సహాయముతో కేరీ గారు బైబిలును తర్జుమా చేయుట ప్రారంభించారు. కలకత్తాలో అనేక మంది ఐరోపా దేశస్తులు నివసిస్తున్నారు. వారిలో మార్టిన్ స్నేహితులైన డేవిడ్ బ్రౌన్, అతనిని తన ఇంటికి రమ్మని ఆదివారము తన చర్చిలో ప్రసంగము చేయమని బ్రతిమాలెను. మార్టిన్ హెన్రీ అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు చున్నాము1 కొరింథీ 1 : 23. అనే అంశముపై ప్రసంగించాడు. ఆ ప్రసంగము చర్చి సభ్యులందరిని ఎంతోగానో కదిలించెను. ఐరోపావారు ఆదివారము చర్చికి వెళ్లుట ఒక ఫ్యాషన్గా భావించెడివారు.
ధనికులు, అధికారులు తమ ఆడంబరమును చూపించుకొనుటకు చర్చికి వచ్చెడివారు. మార్టిన్ హెన్రీ ప్రసంగము ప్రారంభించినప్పుడు కొందరు గుస గుస లాడుకొను చున్నారు. ఒకరిని చూసి ఒకరు ముసి ముసి నవ్వులు నవ్వుకొను చున్నారు. పది నిముషములైన తరువాత అందరూ నిశ్శబ్దముగా ఉండి
ఆ ప్రసంగమును శ్రద్ధగా విన్నారు. ఆ ప్రసంగము వారి హృదయములో గుచ్చుకొన్నది.
ఆ అయిదు నెలలలో ఒక హిందీ పండితుడిని, ముస్లిం సోదరుడిని తనకు టీచర్లుగా నియమించుకొని హిందీ, పారసీకము నేర్చుకొన్నారు. ప్రతీ ఆదివారము నాలుగు ప్రార్థనా కూడికలను నిర్వహించ వలసి వచ్చేది. 7 గంటలకు ఐరోపా వారికి ఇంగ్లీషులోను, మద్యాహ్నం 2 గంటలకు హిందువుల కొరకు హిందీలోను (ఆ కూడికకు దాదాపుగా 200 మంది వచ్చు చుండిరి) సాయంత్రము
ఆసుపత్రిలోని రోగుల కొరకు, రాత్రి 7 గంటలకు సైనికుల కొరకు నిర్వహించెడివారు. వివాహాది కార్యక్రమములు జరిపించుటకు దూర ప్రాంతములకు ప్రయాణమై వెళ్లవలసి వచ్చేది. ఆ రోజులలో రైళ్లు, బస్సులు లేనందు వలన గుర్రపు బండిలోను లేదా ఎడ్ల బండిలోను ప్రయాణము చేయుట వలన అతడెంతో అలసి పోయేవారు. శరీరము సహకరించక పోయిననూ తన పని మానకుండా చేసేవారు.
డేవిడ్ బ్రౌన్ ఆహ్వానము మేరకు 5 నెలల పాటు మార్టిన్ అతని ఇంటిలో ఉండెను. బ్రౌన్ తన స్నేహితునికి ఉత్తరము వ్రాస్తూ “మార్టిన్ హెన్రీ వంటి సేవా తత్పరుడైన మిషనరీ నాకింకెవరూ కనబడలేదు” అని వ్రాసాడు. 5 నెలల తరువాత పాట్నాకు సమీపములోనే డినాపూర్కు వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఉన్న బ్రిటీష్ సైనికులకు ఇంగ్లీషు మాట్లాడే కుటుంబముల వారికి మార్టిన్ పాస్టరుగా పంప బడ్డాడు. అక్కడ ఉన్న వారందరూ ధనవంతులు. వారి పిల్లలు ధన గర్వముతో ఆడంబరముగా జీవించేవారు. మిగిలిన వారి పిల్లలు పాఠశాలలు లేనందువల్ల చదువుకొనే అవకాశము లేనందువల్ల మార్టిన్ డినాపూర్ వెళ్లిన వెంటనే నాలుగు ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాడు. స్థానికులకు విద్యాబోధన చేయుట బ్రిటీషు వారికి నచ్చలేదు. ఒక తెల్లవాడు (శ్వేత
జాతీయుడు) స్థానికులతో స్నేహంగా ఉండుట కూడ వారికి నచ్చలేదు. వారు మార్టిన్ హెన్రీతో “తక్కువ జాతి వారితో నీవు కలని తిరుగుచున్నావు. నీవు బండిలో వెళ్లగలిగిన స్థితిలో ఉన్నావు కాని కాలి నడకన వారితో కలసి తిరుగు చున్నావు” అని ఈసడించారు. మార్టిన్ హెన్రీ "యేసు ప్రభువు పల్లకిలో వెళుతుంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థ పడుట రక్తస్రావముగల స్త్రీకి అసాధ్యమయ్యెడిది. నేను మిషనరీగా అందరిని ప్రభువు దగ్గరకు నడిపించాలి గనుక నేను వారితో కలసి నడచుటయే మంచి పద్దతి” అనేవాడు. దారిలో తనకు కనబడే ప్రతి వ్యక్తికి హిందీలో సువార్త చెప్పేవాడు.
యేసు ప్రభువు చెప్పిన ఉపమానములను కరపత్రికలుగా ముద్రించి వారికి ఇస్తూ ఉండేవారు. బాప్తీస్మము ఇచ్చుటకు చనిపోయిన వారిని పాతి పెట్టుటకు వివాహకార్యక్రమములు జరిపించుటకు అతడు చాల దూరము ప్రయాణము చేయవలసి వచ్చేది. తాను ప్రారంభించిన పాఠశాలలలో గణితము, ఆంగ్లము తానే బోధించేవారు. రోగులుగా ఉన్న వారిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించేవారు. ఏమాత్రము ఖాళీ దొరికినా తర్జుమా చేయడానికి కూర్చునేవారు. స్కాట్లాండుకు చెందిన క్లాడియస్ బుచానన్ (Claudius buchanan) అనే మిషనరీ ఎక్కువ మంది
భారతీయులకు సువార్త ప్రకటించుటకు ఒక పథకమును ఆలోచించి దానిని గవర్నర్ జనరల్ కు, కాంటర్బరీ ఆర్చి బిషపకు పంపించారు. బుచానన్ గారు మార్టిన్ హెన్రీకు గల భాషా నైపుణ్యమును గుర్తించి తన పథకమును మార్టిన్ హెన్రీకు ఇస్తే మంచిదని తలంచారు. ముందుగా క్రొత్త నిబంధనను ఉర్దూ, పారసీక, అరబ్బీ భాషల లోనికి తర్జుమా చేయాలని దానిని మార్టిన్ హెన్రీ పర్యవేక్షించాలని కోరారు.
అతనికి సహాయంగా బెనారస్ వాస్తవ్యుడైన మీర్జా మహమ్మద్ ను, బాగ్దాద్ లో చదువుకొన్న అరబ్బీ పండితుడైన నతానియేల్ సబాత్ ను నియమించారు. తర్జుమా పనిని మార్టిన్ ఎంతో బాధ్యతగా భావించి చాల జాగ్రత్తగా తర్జుమా చేసేవారు. రోజూ 5 గంటలు కూర్చొని 2 రోజుల పాటు శ్రమిస్తే ఒక అధ్యాయము పూర్తి అయ్యేది.
ఒక రోజు మార్టిన్ హెన్రీకు ఒక దుఃఖకరమైన వార్త అందింది. ఆయన సోదరి మరణించింది. మనసులో ఎంత బాధ ఉన్ననూ తన పని మీదే దృష్టిని కేంద్రీకరించి 1808 మార్చి నెలలో క్రొత్త నిబంధనను ఉర్దూ భాషలో తర్జుమా చేయుట పూర్తి చేసారు. భారత దేశములోని ఎండకు మార్టిన్ హెన్రీ తట్టుకోలేక పోయేవారు. అయినా కళ్లు నొప్పి పుట్టే వరకు వ్రాసిన దానిని అనేకసార్లు చదువుతూ తప్పులు సరిదిద్దుతూ ఉండేవారు.
మిలటరీ అధికారులు ఆయనను కాన్పూరుకు బదిలీ చేసారు. 1809 ఏప్రియల్ నెలలో కాన్పూరు వెళ్లాడు. ఆ నెలలో కాన్పూరులో ఎండలు అధికము. కాన్పూరులో దిగిన రోజునే ఎండకు మార్టిన్ హెన్రీ సొమ్మసిల్లి పడిపోయారు. మిలటరీలో పనిచేసే షేరవుడ్ అనే వ్యక్తి ఇంటిలో మార్టిన్కు ఆశ్రయము కల్పించారు. 10 రోజులపాటు జ్వరముతోను, ఛాతిలోని నొప్పితోను మార్టిన్ హెన్రీ ఎంతో బాధపడ్డారు. కొంచెము స్వస్థత కలుగగానే అక్కడ ఉన్న 1000 మంది సైనికులకు
సువార్తను ప్రకటించారు. ప్రతి ఆదివారము ఉదయమే సైనికులకు, 11 గంటలకు సైనికాధికారి ఇంటిలోను, మద్యాహ్నం స్థానికులకు సువార్తను బోధించేవారు. వినే వారి సంఖ్య 500 నుండి 800 వరకు ఉండేది. వారు చాల మొరటుగా ఉండేవారు. వారిలో చాల మంది
భిక్షమెత్తుకొని జీవించేవారు. యువకులు, ఫకీరులు, హిందూ భక్తులు ఆయన మాటలు వినుటకు గుమి కూడేవారు. తాను తర్జుమా చేసిన బైబిల్ లేఖనములను చదివి వినిపించేవారు.
హిందూ భక్తుల ఆరాధనా పద్ధతులను మార్టిన్ సున్నితంగా విమర్శించేవారు. “గంగానది గొప్ప నది కాని గంగ కంటే పెద్ద నదులు ఉన్నవి. మీరు సూర్యుని, చంద్రుడిని పూజిస్తున్నారు. అవి మనకు వెలుగు ఇచ్చే గ్రహములు. నా చేతిలో ఉన్న క్రొవ్వొత్తిని నేను ఆరాధిస్తానా? నా ఇంటిలో ఉన్న క్రొవ్వొత్తి ఎటువంటిదో ఆకాశములో ఉన్న సూర్య, చంద్రులు అటువంటివారే” అని చెప్పి వారిని నిజ దేవుని వైపు తిప్పారు. అతని కృషి వలన 71 మంది హిందువులు మరియు ముస్లిమ్ లు బాప్తీస్మము తీసుకొన్నారు. తరువాతి కాలములో వారిలో ఏడుగురు మాత్రమే విశ్వాసమును వదలి వెళ్లిపోయారు.
కొందరు మిషనరీలుగా స్థిరపడ్డారు. వారిలో అబ్దుల్ అనే ఒక ధనికుడు ముఖ్యమైనవాడు. సనాతన ముస్లిమ్ అయిన అబ్దుల్ ప్రతి ఆదివారము హెన్రీ ప్రసంగములను వినుటకు వచ్చేవాడు. తన 38వ ఏట అబ్దుల్ బాప్తీస్మము తీసుకొన్నాడు. మార్టిన్ హెన్రీ
వ్రాసిన ఉర్దూ తర్జుమాలను అతడు చదువుతూ ఉండేవాడు. అతని వల్ల ధనికులైనవారు, ముస్లిమ్ లు అబ్దుల్ మాటలు విని ప్రభువును అంగీకరించారు. అతని ద్వారా దాదాపు 50 మంది ముస్లిమ్ సోదరులు ప్రభువును
అంగీకరించి బాప్తీస్మము తీసుకొన్నారు. తన స్వంత ఖర్చుతో ఒక ఆసుపత్రిని నెలకొల్పాడు అందువల్ల అందరూ ఆయనను క్రిష్టియన్ డాక్టర్ అని పిలిచేవారు.
ప్రతి ఆదివారము నాలుగు కూడికలను నడిపించుట వలన మార్టిన్ హెన్రీ గారు బాగా అలసి పోయేవారు. ఛాతీలోని నొప్పి ఎక్కువయ్యేది. అతనికి వచ్చు ఆ నొప్పి వంశ పారంపర్యంగా వచ్చేది. అందువలననే మార్టిన్ హెన్రీ తండ్రి చనిపోయాడు. చెల్లెలు మరణించింది. మార్టిన్ హెన్రీకు కూడ ఛాతీ నొప్పి తరచుగా వస్తూ
ఉండడంవలన శ్రేయోభిలాషులందరూ ఇండియాను విడచి వెళ్లిపొమ్మని బ్రతిమాలారు. ఆ నొప్పి వలన అతడు గట్టిగా మాట్లాడలేక పోయేవారు.
కాని అతడు చేస్తున్న అరబ్బీ తర్జుమా ముగింపు దశలో ఉన్నది. విమర్శకులు గ్రాంధిక అరబ్బీ భాషలో ఆ తర్జుమా ఉన్నదని సామాన్య ప్రజలకు అది నిరుపయోగమని వాడుక భాషలో చేస్తే ఎక్కువ మందికి ఉపయోగ పడేదని భావించారు. అందువల్ల హెన్రీ అరేబియా వెళ్లి అక్కడే క్రొత్త నిబంధనను తర్జుమా చేయాలని తాను మరణించక ముందే ఆ పని పూర్తి చేయాలని ఆశించారు. కాన్పూర్ లో ఉన్న జనరల్ అతనికి సెలవు మంజూరు చేసారు. కాన్పూర్ విడచి వెళ్లే చివరి దినమున అతని స్నేహితులందరూ సమావేశమైనారు. వారంతా మార్టిన్ హెన్రీ ముఖము దివ్య తేజస్సుతో వెలిగిపోవుట గమనించారు.
1810 నవంబరు 25న అతడు కలకత్తా చేరారు. థామస్ గారు ఆయనను చేర్చుకొన్నారు. థామస్ గారికి బైబిల్ చదవటం అంటే ఎంతో ఇష్టము. తన వద్ద నున్న హెబ్రీ బైబిల్ ను చిన్న చిన్న పుస్తకములుగా విభజించి వాటిని బైండ్ చేయించి ఒక పుస్తకమును ఎప్పుడూ తన జేబులో ఉంచుకొనేవారు. ఏ మాత్రము ఖాళీ దొరికినా బైబిల్ ను బైటకు తీసి చదువుతుండేవారు.
మార్టిన్ హెన్రీ వ్రాసిన పారసీక క్రొత్త నిబంధన కూడ గ్రాంధిక భాషలో ఉండుట వలన మొదట పర్షియా వెళ్లి అక్కడ తాను తర్జుమా చేసిన క్రొత్త నిబంధనను సంస్కరించాలని ఆశించాడు. పర్షియా వెళ్లుటకు బొంబాయి వెళ్లి అక్కడ నుండి బొర్ వెళ్లాలి కాని బొంబాయి వెళ్లే నౌకలో అతనిని తీసుకొని వెళ్లుటకు కెప్టెన్ అంగీకరించలేదు. చాల మంది అరబ్బీ నావికులు ఆ ఓడలో పని చేయుట వలన వారిని క్రైస్తవులుగా మార్చితే ఓడలో తిరుగుబాటు వస్తుందని కెప్టెన్ భయపడ్డాడు.
కొంత కాలము కలకత్తాలోనే వేచియున్న తరువాత బ్రిటీష్ అధికారిగా పూనాలో నియమించబడిన మౌంట్ స్టూవర్ట్ ఎల్ఫిన్స్టన్ బొంబాయి వెళ్లుచుండగా అతని ఓడలో మార్టిన్ హెన్రీ బొంబాయి వరకు వెళ్లాడు. స్టూవర్ట్
బొంబాయిలో దిగగానే మార్టిన్ కు దౌత్యవేత్తయైన సర్ జాన్ మల్కొమ్ ను పరిచయం చేసాడు. మల్కొమ్ దౌత్యవేత్తగా పర్షియాకు రెండు సార్లు పంపబడ్డాడు. అతడు మార్టిన్ హెన్రీకు ఎంతో సహాయము చేసాడు. పర్షియాలో ఉన్న అనేక పెద్దల చిరునామాలు వారికి సిఫారసు లేఖలు మార్టిన్ హెన్రీకు ఇచ్చాడు.
ఈస్టిండియా కంపెనీవారు పంపిన ఓడలో మార్టిన్ పర్షియా చేరుకొన్నారు. ఆ ఓడలోని ఐరోపా వారికి పాస్టరుగా పనిచేస్తూ పర్షియా చేరుకొన్నారు. పర్షియన్లు ధరించే దుస్తులను కొనుక్నొన్నారు. అక్కడ ఉన్న
పండితులకు తాను తర్జుమా చేసిన వ్రాత ప్రతిని చూపించారు. వారు ఇది వాడుక భాష కాదు అని చెప్పగానే తాను చేయవలసిన పని చాల ఉన్నదనీ, ఆ పని పూర్తి అయ్యేవరకు పర్షియాను విడచి వెళ్లకూడదనీ అనుకొన్నారు. 1811 మే, 30న కొంతమంది వర్తకులు షిరాజ్ పట్టణమునకు వెళ్లుచుండగా మార్టిన్ వారితో కలసి షిరాజ్ చేరుకొన్నాడు. ఆ పట్టణములో అనేకమంది కవులు, పండితులు ఉన్నారు గనుక తన తర్జుమా
విషయములో మంచి సలహాలు పొందవచ్చునని వెళ్లాడు. ఆ ప్రయాణము చాల కష్టమైనది. ఎండ వేడి మార్టిన్ భరించలేనిదిగా ఉండెను. చివరికి మల్కొమ్ గారు సిఫారసు చేసిన ఉత్తరము పట్టుకొని జఫీర్ ఆలీఖాన్ (Jaffir Alikhan) Mirzaseyd) యింటికి చేరుకొన్నాడు.
జఫీర్ ఖాన్ చాల ధనవంతుడు మరియు పండితుడు. ఆలీ ఖాన్ బావయైన మీర్జా సయ్యద్ పారసీక భాషలో పండితుడు. ఆయన సహాయంతో తాను వ్రాసిన క్రొత్త నిబంధనను సంస్కరించుట ప్రారంభించారు. చాల రోజులు ఆ పని చేయుటకు జఫీర్ ఆలీ ఖాన్ ఇంటిలో ఉండవలసి వచ్చినది. అతని రాక గురించి నగరములో కల కలము రేగింది. మల్కోమ్ గారు సిఫారసు చేసిన ఈ మనిషి క్రైస్తవుడు గనుక తమ మతస్థులను క్రైస్తవులుగా మార్చునేమో అని కొందరు సందేహ పడిరి. అనేకులు తరచు జఫీర్ గారి యింటికి వచ్చి మార్టిన్ తో “మీరు వచ్చిన పని ఏమి?” అని విచారించేవారు. ఆ విధంగా చాల మంది వచ్చుట వలన వారితో మత సంబంధమైన
విషయములు మాట్లాడుట వలన తర్జుమా విషయము ఆలస్యమయ్యెడిది.
షియాజ్ పట్టణములో మీర్జా ఇబ్రహీమ్ అనే పండితుడు ఉన్నాడు. అతడు హెన్రీని తన యింటికి ఆహ్వానించి గంటల కొద్దీ వాదోప వాదములు చేసాడు. కాని మార్టిన్ గారి జ్ఞానము ముందు అతనికి తల వంచక తప్పలేదు.
1812 ఫిబ్రవరి, 8వ తేదీ మార్టిన్ గారి 31వ జన్మదినము. క్రొత్త నిబంధన దాదాపు పూర్తి కావచ్చినది.
ప్రకటనలో చివరి 8 అధ్యాయములు మిగిలియున్నవి. తరువాత రెండు వారములకు క్రొత్త నిబంధన తర్జుమా పూర్తియైనది. వెంటనే వాటిని అచ్చు వేయవలసినదని ఇండియాలోని సిరంపూర్ లో ఉన్న విలియమ్ కేరీ గారి వద్దకు పంపించారు. వాటి నకలు ఒక ప్రతిని ఇరాన్ రాజైన అబ్బాస్ మీర్జాకు బహుకరించారు.
తాను వచ్చిన పని ముగిసినందుకు మార్టిన్ ఇరాన్ విడచి వెళ్లుటకు సిద్ధపడు చుండెను. మహమ్మద్ రహీమ్ అనే వ్యక్తి అనేకసార్లు మార్టిన్ ను కలుసుకొని వాదోప వాదములు చేసినాడు. ఆ పట్టణస్థులందరికి గడ్డము ఉండేది. మార్టిన్ రోజూ క్షౌరము చేసుకొనేవారు గనుక అతనిని “గడ్డము లేని అబ్బాయి” అని పిలిచేవారు. రహీమ్ అనేకసార్లు పరుషముగా మాట్లాడిననూ మార్టిన్ శాంతముగా, సమాధానము ఇచ్చినందువలన అతని హృదయము మారెను. మార్టిన్ వెళ్లిపోవుచున్నాడని తెలిసి
www.gospel needs.com
అతని వద్దకు వచ్చి క్షమించమని అడిగి యేసు ప్రభువే రక్షకుడని అంగీకరించెను. మార్టిన్ అతని గురించి ప్రార్థించి తన వద్ద నున్న క్రొత్త నిబంధన వ్రాత పతిని అతనికిచ్చెను. దీనిపై మీ సంతకం చేసి ఇమ్మని రహీమ్ కోరినప్పుడు “ఒక పాపి మారుమనస్సు పొందుట వలన
పరలోకములో ఎంతో సంతోషము కలుగును” అని వ్రాసి దాని క్రింద తన సంతకము చేసి ఇచ్చారు.
మరొక వర్తక బృందము తబ్రేజ్ పట్టణమునకు వెళ్లుచున్నదని తెలుసుకొని వారితో కలసి బయలుదేరెను. తబీజ్ పట్టణములో బ్రిటీష్ రాయబారి సర్ గోర్ అవుసిలీ (Sir Gore Ouseley) ఉన్నారు. ఆయనను కలుసుకొంటే
ఇరాన్ రాజు గారిని కలుసు కోగలను అనుకొని ప్రయాణము కొనసాగించినారు. 740 కిలోమీటర్లు ప్రయాణించుటకు దాదాపు 20 రోజులు పట్టినది. చివరికి పర్షియా రాజధానియైన టెహ్రాన్ చేరుకొన్నారు. అక్కడ నుండి తబ్రేజ్ వెళ్లుటకు 528 కిలోమీటర్లు ప్రయాణించాలి. చివరకు తబ్రేజ్ చేరి బ్రిటీష్ రాయబారిని కలుసుకొన్నాడు.
ఇరాన్ రాజైన షాను కలుసుకొనుటకు ముందు షా యొక్క మంత్రియైన వజీరు కలుసుకొనుటకు సర్ గోర్ అవుసిలీ సిఫారసు పత్రిక ఇచ్చాడు. వజీర్ వద్దకు వెళ్లినప్పుడు ఆయన అనారోగ్యంగా ఉండుట ఇద్దరు
సెక్రటరీలు దాదాపు రెండు గంటలు మార్టితో వాదోప వాదములు చేసినారు. మూడు రోజులపాటు ఒక సత్రములో వజీరు కలుసు కొనుటకు మార్టిన్ వేచి
యున్నారు.
నాలుగవ రోజున వజీర్ ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు తాను తర్జుమా చేసిన పారసీక భాషలో ఉన్న
క్రొత్త నిబంధనను తీసుకొని అక్కడకు వెళ్లారు. క్రొత్త మతమును భోదించుటకు వచ్చినాడని తెలియగానే అక్కడ ఉన్న వారందరూ ఆగ్రహోగ్రులైరి. తొమ్మిది మంది ఒక ప్రక్క మార్టిన్ మాత్రమే ఒక్కడుగా నిలిచెను. వజీర్ “దేవుడు గొప్పవాడు. మహమ్మద్ ఆయన ప్రవక్త (అల్లా హో అక్బర్) అని వారు సాధారణంగా చెప్పే విశ్వాస ప్రమాణమును మార్టిన్ ను చెప్పమన్నాడు.
సభ అంతా నిశ్శబ్దమైనది. మార్టిన్ “దేవుడు గొప్పవాడు” అని చెప్పి “యేసు ప్రభువు ఆయన కుమారుడు” అని చెప్పారు. వారందరికీ ఎంతో కోపము వచ్చి "నీవు చేసిన దైవ దూషణకు నీ నాలుక కాలుస్తాము” అన్నారు. కాని బ్రిటీష్ జాతీయుడైనందు వలన మార్టిన్ను
ఏమీ చేయలేక బయటకు పంపివేసెను. వజీర్ ద్వారా
షా ను చేరుకోలేమని మార్టిన్ కు అర్థమైనది. అందువల్ల తబ్రేజ్ వెళ్లి బ్రిటీష్ రాయబారియైన సర్ గోర్ అవు లీ గారి ద్వారా ప్రయత్నించ వలెనని ఎట్టకేలకు తబ్రేజ్
చేరారు. ప్రయాణము వలననూ, అనారోగ్యము వలననూ మార్టిన్ ఎంతో శుష్కించి యున్నాడు. రాయబారి మరియు ఆయన భార్య మార్టినను ఎంతో ప్రేమతో చేర్చుకొని ఆతిధ్యమిచ్చారు.
తాను రోగియై యున్నందు వలన షాను చూడలేనని రాయబారికి తన వ్రాత ప్రతులను ఇచ్చి రాజుకు బహుకరించమని కోరినాడు. సర్ గోర్ క్రొత్త నిబంధన తీసుకొని రాజుకు బహుకరించాడు. రాజు దానిని తీసుకొని “ఈ తర్జుమా చాల బాగా ఉన్నది. తేలికగా
అర్థమయ్యే ఇటువంటి పుస్తకమును నాకు బహుకరించినందుకు వందనములు” అని మార్టిన్కు ఉత్తరము వ్రాసాడు. సర్ గోర్ అవులీ మరొక పని చేసారు. ఆ తర్జుమా బాగా ఉన్నదని దానిని రష్యా తీసుకొని వెళ్లి బైబిల్ సొసైటీ వారిచే ప్రింట్ చేయించెను.
ఆ విధముగా కలకత్తాలోని సిరంపూర్ లో ప్రింట్ అవుటకు ముందే రష్యాలో హెన్రీ మార్టిన్ వ్రాసిన క్రొత్త
నిబంధన అచ్చుయైనది. రెండు నెలల వరకు మార్టిన్ కోలుకోలేదు. కా స్టాంటినోపుల్ వెళ్లి అరబ్బీ భాషలో
క్రొత్త నిబంధనను తర్జుమా చేయాలని సంకల్పించారు. సర్ గోర్ అవులీ టర్కీ గవర్నర్కు సిఫారసు లేఖను ఇచ్చాడు. కాన్స్టాంటినోపుల్ వెళ్లాలంటే 1300 మైళ్లు గుర్రముపై ప్రయాణించాలి. ఆరోగ్యముగా ఉన్న వ్యక్తికే ఆ ప్రయాణము చాల కష్టము. బలహీనంగా ఉన్న ఇతడు చేరుకోగలడా? అని అందరూ అనుకొన్నారు.
1812 సెప్టెంబరు 2న మార్టిన్ ప్రయాణమయ్యాడు. మార్టిన్ కాన్స్టాంటినోపుల్ ను సమీపిస్తున్నప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రతి దినము అనేక వందల మంది మరణిస్తున్నారు. అనేకులు ఆ పట్టణమును విడచి వేరే
ప్రాంతమునకు వెళ్లిపోవుచున్నారు. 1812 అక్టోబర్ 14న తనకు పరిచర్య చేస్తున్న సెర్గియస్ అనే వ్యక్తికి తన వద్దనున్న వస్తువులను అప్పగించి కాన్స్టాంటినోపుల్ కి తీసుకొని వెళ్లమన్నాడు. తాను మరణించే సమయము
ఆసన్నమైనదని గ్రహించారు.
చివరికి టోకట్ అనే గ్రామము చేరుకొని అక్టోబరు, 16న ప్రభువునందు నిద్రించారు. అక్కడ ఉన్న పాస్టరు
గారు ఆయనకు సమాధి కార్యక్రమము నిర్వహించి శిలా
ఫలకముపై "తూర్పు దేశాలలో అనేక సంవత్సరములు మార్టిన్ దేవుని కోసం శ్రమించారు. బైబిల్ ను హిందీలోనికి, పారసీక భాషలలోనికి తర్జుమా చేసారు.
దైవజనునిగా తూర్పు దేశాలలో ఆయన చిరస్మరణీయునిగా ఉంటారు” అని చెక్కారు.
హెన్రీ మార్టిన్ యొక్క చిత్ర పటమును (ఆయన కలకత్తాలో ఉండగా చిత్రించినది) చార్లెస్ సిమియోను గారు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తగిలించారు. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను ఎంత కష్టమైనా
నెరవేర్చాలని మార్టిన్ నన్ను ఉద్బోధిస్తున్నారు అని అందరికి చెప్పేవారు. తరువాత తన శిష్యుడైన మార్టిన్ ఫోటో వైపు నవ్వుతూ చూస్తూ “అలాగేనయ్యా! ఎంత కష్టమైనా నెరవేరుస్తా” అని అనేవారు.